11/09/2016

పవన్ కు ముద్రగడ బంపర్ ఆఫర్

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. జనసేనానికి ఈ రోజు ఇద్దరు ప్రముఖులు తమ మద్దతు ప్రకటించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం సినీ నటుడు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ ఆదివారం గుంటూరులో పేర్కొన్నారు.

ఇక కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సైతం ఈ రోజు రాజమండ్రిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పవన్ కు సూపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమాన్ని నడిపితే తామంతా ఆయన వెనకే ఉండి పోరాటం చేసేందుకు సిద్ధమే అని తెలిపారు. ఆదివారం రాజమండ్రిలో కాపులంతా కలిసి సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

  ప్రత్యేక హోదాను చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న విమర్శలు చేసిన ఆయన.. చంద్రబాబు కాపుల్లో చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే ఆ పప్పులుడకవని హెచ్చరించారు. ఇక కాపులంతా రిజర్వేషన్ల కోసం సమైక్యంగా ఉద్యమిస్తున్నారని...తమ డిమాండ్లను తాము సాధించి తీరుతామని ఆయన చెప్పారు. చంద్రబాబు కేవలం కుర్చీ కోసమే కాపుల్లో ఐక్యత దెబ్బతీసే ప్లాన్లు వేయడంతో పాటు తనపై కాపు వ్యతిరేకి - టెర్రరిస్ట్ అన్న ముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

 ఇక బాబు ఓటుకు నోటు కేసుకు భయపడుతున్నారని..ఆయన హోదాను అమ్మేసి భూములను దోచుకున్నారని... హోదాను కేంద్రానికి - భూములను సింగపూర్ కు అమ్మేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దమ్ముంటే తుని లాంటి సమావేశం పెట్టాలని కూడా ముద్రగడ సవాల్ విసిరారు. మరి ముద్రగడ ఆఫర్ ను పవన్ స్వీకరిస్తారా ?  పవన్కు ముద్రగడ మద్దతు ఇస్తారా ? అన్న ప్రశ్నలు ఇప్పుడు మళ్లీ సరికొత్త రాజకీయ చర్చకు దారితీశాయి.

No comments:

Post a Comment