13/09/2016

జనం మనం - మళ్లీ పెన్ను పడుతున్న పవన్

ప్రత్యేక హోదాపై కాక రేపుతున్న జనసేన అధినేత - సినీ హీరో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలతో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సభలు సమావేశాలతో పాటు పుస్తకం కూడా రాయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ ఇతివృత్తంతో రానున్న ఈ పుస్తకంలో రాజకీయాలు ఎలా ఉండాలి... ప్రస్తుతం ఎలా ఉన్నాయి... తమ కార్యాచరణ ఏంటనేది రాసుకొస్తారని తెలుస్తోంది. ఈ పుస్తకానికి ‘జనం మనం" అన్న టైటిల్ ఖరారు చేసినట్లు వినికిడి.

కాగా పవన్ గతంలోనూ పుస్తకం రాశారు. ఇజం పేరుతో ఆయన రాసిన పుస్తకానికి ఒక మోస్తరు స్పందన వచ్చింది అప్పట్లో.  కొత్త పుస్తకం 'జనం-మనం"కు  మార్పు కోసం యుద్ధం అన్న సబ్ టైటిల్ ఉంటుందని సమాచారం.  ఇప్పటికే మొదలుపెట్టిన ఈ పుస్తకాన్ని మరో రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఈ పుస్తకం  ద్వారా జనసేన సిద్ధాంతాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇజంలో కంటే మరింత క్లారిటీగా పలు అంశాలను ఈ పుస్తకం ద్వారా పవన్ కల్యాణ్ వివరించే అవకాశాలున్నాయి. రాజకీయంగా పవన్ కు కూడా క్లారిటీ పెరగడం.. అనేక అనుభవాలు.. అన్నిటి నేపథ్యంలో ఈ పుస్తకంలో కొంత వాస్తవిక ధోరణి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సభ తరువాత మళ్లీ ఇప్పట్లో సభేమీ లేకపోవడంతో పవన్ పుస్తక రచనలో మునుగుతున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment