09/09/2016

పవన్ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ -ముఖ్యాంశాలు

"దేశంలో భౌతికంగా కింద ఉండటం వల్లేమో.. కేంద్రంలో ఉన్న మీకు మేము కనిపించడంలేదు.. ఇకపై సీమాంధ్ర ప్రాంతం తన పోరాటాన్ని తన ఆవేదనను కేంద్రంలోని బీజేపీకి వినిపించేలా కనిపించేలా జనసేన చేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ మాట చెబుతున్నాను. పోరాడదాం.. పోరాడదాం.. సాధించేవరకూ పోరాడదాం... గెలిచేవరకూ పోరాడదాం... ప్రత్యేక హోదా వచ్చేవరకూ మన హక్కులు సాధించేవరకూ పోరాడదాం... హం లడేంగే.. హం లడేంగే.. జీత్ నే తక్క్ లడేంగే.." ఈ స్థాయిలో కేంద్రప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసిన పవన్ కల్యాణ్ ఆగస్టు 27న జరిగిన తిరుపతి సభలో ప్రకటించినట్లుగానే ఈరోజు (సెప్టెంబరు 9) కాకినాడలో "సీమాంధ్రుల  ఆత్మగౌరవ సభ"ను ఏర్పాటుచేశారు.

భారీ అంచనాల నడుమ.. సంచనాలు ఆశిస్తూ ఆశగా చూస్తున్న అభిమానుల - కార్యకర్తల హర్షధ్వానాల నడుమ.. ఐదుకోట్ల ఆంధ్రుల నేత్రాలు కాకినాడలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో ఏర్పాటుచేసిన సభామైదానం వైపు చూస్తుండగా... జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం మొదలైంది. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అంటారు గురజాడ. దేశభక్తి ఒక్క ఉత్తర భారతీయులకే కాదు మన దక్షిణ భరతీయులకు కూడా ఉంది. భారత రాజ్యాంగంపై వారికి ఎంత గౌరవం ఉందో.. మనకు కూడా అంతే గౌరవం ఉంది.. "భారత్ మాతా కీ జై".

ఏం నాయనా లడ్డూ లడ్డూ తింటావా అంటూ.. మూడు సంవత్సరాలుగా పాచిపోయిన లడ్డూ ఇచ్చారు.. వెంకయ్య మోడీ! అవకాశ రాజకీయాల వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. బీజేపీ నాయకులకు ఎంత దైర్యం.. ఏపీకే వచ్చి మీటింగ్ పెట్టి ఆ రాష్ట్రాన్నే రెండు ముక్కలుగా విభజించారు. మాలో పోరాటం తగ్గిందని భావిస్తున్నారా?

2014 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ బీజేపీ ఎంపీలు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన కథ అంతా మీలాగానే నేనూ విన్నాను. ఏమో ఇస్తారేమో ఇస్తారేమో అని మీలాగానే నేను కూడా ఎదురుచూశాను. ఆ పాచిపోయిన రెండు లడ్డూలు మన ఎంపీలు పంచుకు తినడానికే సరిపోవు.. ఇంక ఇంతమంది జనాలకు ఎలా సరిపోతుంది.

టీడీపీ నాయకులపై నాకు ఇంకా గౌరవం తగ్గలేదు. ప్రజా సమస్యల విషయంలో మాత్రమే వారితో విభేదిస్తాను తప్ప.. వ్యక్తిగతంగా నాకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవు. అవకాశ వాద రాజకీయల ఫలమే ఈ సమస్య.. నేటి సమస్య. జాతీయ నాయకులారా.. జాతీయస్థాయి నాయకుల్లారా కొత్త కొత్త సమస్యలను సృష్టించే పని చేయకండి.. చెత్త రాజకీయాలు చేయకండి. 

రెండేళ్లుగా ఈ విషయంపై నిద్రపోతున్నానని అంతా నన్ను అంటున్నారు. వారికి చెబుతున్నాను.. ఒరేయ్.. దాన్ని నిద్ర అని మీరంటున్నారు ధ్యానం అని నేనంటున్నాను. ఎవరి సంస్కారం బట్టి వారికలా కనిపిస్తుంది. రాజకీయాలంటే గెడ్డం గీసుకోవడమంత సులువు కాదని చెబుతూ నన్ను విమర్శించే రాజకీయ నాయకులకు ఒకటి చెబుతున్నారు. నేను మీలాగా అవకాశవాద రాజకీయాలు చేయాలని రాలేదు.. ఒక సైద్ధాంతిక బలంతో వచ్చాను. నా వెనక వేల కోట్లు లేవు.. మాతాత పోస్ట్ మేన్.. మా నాన్న కానిస్టేబుల్. నన్ను సినిమాలు మానెయ్యమంటారు.. అలా చేస్తే నాకు తినడానికి తిండి ఉండదు.. మీరే నాకు తిండిపెట్టాలి!

నా వెనక గాడ్ ఫాధర్స్ ఎవరూ లేరు.. నన్ను బీజేపీ వాళ్లు టీడీపీ వాళ్లు నడిపించాల్సిన పని లేదు.. నన్ను ఒకడు నడిపించాల్సిన అవసరం లేదు.. నేను నడవగలను.. ఏం.. మనం నడుచుకోలేమా?

::చరిత్ర పాఠాలతో కాంగ్రెస్ బీజేపీ లకు క్లాస్::

పొట్టి శ్రీరాముల ఆమరణదీక్షతో మనకు రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ వాళ్లు కూడా మన అన్నదమ్ములు సోదరులు ఆడపడుచులు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాడు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆంధ్రా - తెలంగాణలను కలిపారు. కేవలం 20 సంవత్సరాల కోసం ఈ బందం ఏర్పాటుచేసినా.. తర్వాత చాలా కాలం కలిసే ఉన్నారు. నాటి జై ఆంధ్ర ఉధ్యమంలో 400మందికి పైగా విద్యార్థులు చనిపోయారు! ఇప్పుడున్న వెంకయ్య గారు కూడా నాటి జై ఆంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.. అయినా ఏమి ప్రయోజనం కలిగింది?

కాంగ్రెస్ చరిత్ర 150 ఏళ్లు అని చెప్పుకుంటారు.. సరే నేనూ ఒప్పుకుంటాను. కానీ ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగా ఇప్పుడున్న నేతలకు విలువలున్నయా ఇందిరా గాంధీలాగా సిద్ధాంతాలు ఉన్నాయా.. నాడు వారు పెట్టిన సిద్ధాంతాలను కాదని 2014 లో రాష్ట్ర విభజనకు ఎందుకు సపొర్ట్ చేసింది నేటి కాంగ్రెస్ పార్టీ. జాతీయ సమగ్రత గురించి ఊకదంపుడు ఉపన్యాశాలు ఇచ్చే ఈ రెండు జాతీయ పార్టీలు వారి వారి చేతకాని తనాలవల్ల ప్రజలను విడగొట్టారు. అటు తెలంగాణను ఆదుకోక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక.. రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. 

ఒక్క ఓటు వెయ్యండి.. రెండు రాష్ట్రాలు ఇస్తామని చెప్పారు.. అది చేశుకున్నారు. మరి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. ఎందుకు ఇవ్వడం లేదు. కమిషన్లు ఒప్పుకోవడం లేదు అరుణ్ జైట్లీ ఒప్పుకోవడంలేదు.. వారొప్పుకోవడం లేదు - వీరొప్పుకోవడం లేదని చెప్పి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టడం కరెక్టా... సిగ్గు అనిపించడం లేదా? బీజేపీ నేతల్లారా మీరంతా అంబేద్కర్ గారిని గౌరవించేవారైతే స్పెషల్ స్టేటస్ పై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండండి.

::రేపటి సమ్మెపై స్పందిస్తూ...::

ప్రజా ఆస్తులకు నొప్పి కలగకుండా.. అంతా ఫెయిలయితే అప్పుడు మనం పోరాడటం మొదలుపెడదాం. నేను సమ్మెలకు - ధర్నాలకు వ్యతిరేకం కాదు. నా సంగతి వదిలేయండి.. మీకు కావాలనుకుంటే మీరెల్లి బందుల్లో పాల్గొనండి. అయినా మీరెందుకు బందులు చేయాలి - ధర్నాల్లో పాల్గొనాలి. ఎమ్మెల్యేలు ఉన్నారు పార్లమెంట్ క్యాంటిన్స్ లో డిస్కౌంట్ ధరలకు తినే వారిని అడగమనండి. మీరు చదువుకోవాలి - ఉద్యోగాలు చేయాలి.. ఆ ధర్నాలు - బంద్ లు మీరు చేయకూడదు.

::తెలుగుదేశంపై స్పందిస్తూ...::

తెలుగుదేశానికి నేను కేవలం ఓటు మాత్రమే వెయ్యలేదు.. మద్దతు తెలిపాను. నా ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ మద్దతు తెలిపాను. సీమాంధ్ర నాయకులను దద్దమ్మల్లారా అన్నా ఏమన్నా.. కూడా ఒక్కరుకూడా సరైన రీతిలో స్పందించలేదు. అలాంటి పౌరుషం మన ఎంపీలది! మహానాయకులు నడిచిన పార్లమెంటులో ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకులు నడుస్తుంటే.. ఇలా ప్రవర్తిస్తుంటే చాలా బాద వేసింది.

సీమాంధ్ర నాయకులు చేయని తప్పులకు 10సంవత్సరాలు బాదలు పడ్డారు. రెండు ప్రాంతాల పోలీసులు సైతం కొట్టుకునే దిగజారుడు రాజకీయాలు చేశారు. అప్పుడే టీడీపీకి చెప్పాను... నేను మీ తరుపున ఒక కార్యకర్తలా పనిచేస్తాను అని. నేను ఉస్మానియాకు వెళ్లినప్పుడు నీకేమి తెలుసు పవన్ కల్యాణ్ అని అడిగారు. ఆ సందర్భంగా నా స్నేహితుడు - సన్ని హితుడు - తెలంగాణ కవి మాస్టర్ జీ పాత పాట ఒకటి పాడాను.

ఊరు దొరలకు ఒంపుడు గత్తెను.. నేను జోగినమ్మ... 

నా పేరు జోగినమ్మా.. నేనూ ఊరి సాయినమ్మ..

వయసున్నప్పుడె ఒక్కరొక్కరూ అనుభవించెరమ్మా.. రోగం పెంచి వెళ్లిరమ్మా..

ఉడిగిన వయసుకు ఈ రోగాలే సంపాదాయెనమ్మ.. సిరి సంపాదాయెనమ్మా..

ఈ పాటపాడి చెప్పాను.. తెలంగాణ ప్రజలు ఎలాంటి కష్టాలు పడ్డారో - నాకేమి తెలుసో అని!

::తెలుగువాడి పౌరుషంపై మాట్లాడుతూ...::

నాడు తెలంగాణ నాయకులు సీమాంధ్రులను తిడుతుంటే ఎవ్వరూ మాట్లాడలేదు.. ఈరోజు కేంద్రం సీమాంధ్ర ఎంపీలను అగౌరవపరుస్తున్నా మౌనంగానే ఉంటున్నారు. 

గుంటూరు శేషాద్రి శర్మ గారు గరు ఒక మాట అన్నారు... 

సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కుర్చుని మొరగదు.. 

తుఫాను గొంతెత్తి చిత్తం అని అనడమెరగదు.. 

పర్వతం ఎవ్వడికీ వంగి సలాం చేయదు.. 

ఆత్మగౌరవం ఉన్న ఏ తెలుగోడూ కేంద్రానికి జీ హుజూరు అని గులాం గిరీ చేయడు...

తెలుగుదేశం నాయకులకు ఎంపీలకు ఒకటి చెబుతున్నాను... దయచేసి మా సీమాంధ్రుల గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని కేంద్రంవద్ద తాకట్టుపెట్టొద్దు - తలదించుకునేలా చెయ్యొద్దు. గట్టిగా మాట్లాడండి గొంతెత్తి మాట్లాడండి.. గుండెత్తి మాట్లాడండి.. మీరు చెప్పండి. మీరు చెప్పండి... మావల్ల కాదు మేము చేతులు ఎత్తేశాం.. ప్రత్యేక హోదాపై మేము పోరాడలేం అని.. అప్పుడు జనసేన వస్తుంది.. అది చూపిస్తుంది.. దేశం మొత్తన్ని స్థంబింపచేస్తుంది.

::వెంకయ్య నాయుడికి సీరియస్ క్లాస్::

వెంకయ్య గారూ ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు మీరన్నీ మాకు అర్ధమయ్యే భాషలో మాట్లాడతారు.. ఎన్నికలు అయ్యాక మాకు అర్ధమవ్వని భాషలో మాట్లాడతారు. ఇస్తారో ఇవ్వరో చెప్పంది.. అప్పుడు మేము ఆలోచిస్తాం.. ఏమి చేయాలో! 

వెంకయ్య గారూ మీరు పెద్దలు - మీరంటే నాకెంతో గౌరవం. మీరు పెద్దమనిషి ముసుగులో సీమాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. అందుకు మీకు నేను వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తున్నందుకు మనస్పూర్తిగా నన్ను క్షమించండి. 

వెంకయ్య గారూ మీరు కానీ ఇంకా ప్రత్యేక హోదాపై పోరాడకపోతే.. సింధూని గౌరవించడానికి నెల్లూరు వెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని సిందూ పెంచిందని మీరు చెబుతారు.. అప్పుడు అక్కడున్న ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు.. మీరేమి చేశారు సీమాంధ్రకు అని! మీరు స్పెషల్ స్టేటస్ పైన పోరాటం చేయకుండా లొంగిపోతే.. మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడ మిమ్మల్ని అవమానిస్తారు. 

నేను మా అన్నయ్యను వదిలి - మా వదినను వదిలి - మా అమ్మను వదిలి - నా అక్క చెల్లెల్లను కాదనుకుని బీజేపీకి - టీడీపీకి కొమ్ముకాసాను - భుజం కాసాను.. ప్రాణాలకు తెగించి అండగా నిలబడ్డాను. నాడు మా ఆత్మగౌరవాన్ని కాపాడతానని గద్దెనెక్కిన మీరు.. ఈ రోజున ప్రజలకు ఏమీ చేయనంటే ఊరుకోను. ఇక్కడున్న ఒక్క జనసేన సైనికుడు కూడా ఊరుకోడు.

ఏపీలో బీజేపీ పరిస్థితిని వెంకయ్య గారు పూర్తిగా చంపేశారు. మీరు వేరే పార్టీని ఆశ్రయించండి. అప్పుడు బ్రిటీష్ వాళ్లకు భారతీయ రాజులు ఎలా తొత్తులుగా వ్యవహరించారో నేడు మీరంతా కేంద్రంవద్ద అలానే ప్రవర్తిస్తున్నారు. వెంకయ్య గారూ.. మీకు వ్యతిరేకంగా పోరాడే పరిస్థితిని నాకు కల్పించకండి.

సీమాంధ్ర నాయకుల్లారా - ఎంపీల్లారా ఒంటికి కాస్త కారం రాసుకుని - రెండు కారం ముద్దలు తిని అయినా పౌరుషం తెచ్చుకోండి.. పోరాడండి.. సిగ్గు లేదా?

టీజీ వెంకటేష్ గారు నన్ను కుంభకర్ణుడు అన్నారు.. నేను నోరెత్తితే మీపైనా టీడీపీపైనా చాలా మాట్లాడగను. కర్నూల్ లో మీ పరిశ్రమలు చాలా కాలుష్యం వెదజల్లుతున్నాయి. నేను వాటిపై కూడా మాట్లాడగలను మీరు రాజకీయాల గురించి నాకు చెప్పకండి. మీలా సంస్కార హీనంగా నేను మాట్లాడలేను. టీడీపీ నేతలను అడగండి.. నేను టీడీపీకి ఎంత చేశానో.. మీరు అలా నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

బీజేపీ నాయకుల్లారా.. సీమాంధ్ర ఎంపీల్లారా.. దయచేసి పోరాడండి. మీవల్ల కాకపోతే నాకు వదిలేయండి.. జనసేనకు వదిలేయండి... జై హింద్.. జై హింద్... జై హింద్...

No comments:

Post a Comment